అపకారికి ఉపకారం...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
●అనగనగా ఓ కుందేలు పిల్ల. అది తోవ తప్పింది. వెళుతూ వెళుతూ సింహ గుహలోకి వెళ్ళిపోయింది. నిద్రపోతున్న సింహంపైకెక్కి జూలు పట్టుకొని ఆడుకోవడం ప్రారంభించింది. సింహానికి మెళుకువ వచ్చింది. కోపం వచ్చింది కూడా. చిన్నపిల్ల దీనికేం తెలుస్తుంది పాపం. సింహానికి జాలేసింది.
ఎలాగైనా వాళ్ళమ్మ దగ్గరకు చేర్చాలనుకొంది. అంతలోనే అటుగా వచ్చిన నక్కను పిలిచి "ఓయ్ నక్కా! ఇలారా! ఈ కుందేలు పిల్ల తప్పిపోయి ఇలా వచ్చింది. దీన్ని వాళ్ళమ్మ దగ్గరకు చేర్చు" అంటూ ఆజ్ఞ జారి చేసింది. దానికి నక్క "సరే సింహం రాజా! మీ ఆజ్ఞను శిరసావహించి ఈ చిట్టి కుందేలును తన తల్లి దగ్గరకు చేరుస్తాను" అంటూ అక్కడి నుండి కుందేలు పిల్లతో బయలు దేరింది నక్క.
మార్గ మధ్యలో నక్కకు ఓ పాడు బుద్ధి పుట్టి "ఈ పూటకు నేను ఆహారం కోసం వెతుక్కోవాల్సి న పని లేదు ఈ కుందేలు పిల్లను తింటే సరి పోతుంది కదా!" అనుకుంటూ బయలు దేరింది. మార్గ మధ్యలో చిట్టి కుందేలును చంపి తినడానికి ప్రయత్నించింది నక్క.
కుందేలు పిల్లకు ఏమీ చేయాలో తోచక దాని బారినుండి బయట బడాలని ఒక్క ఉదుటున పరుగు లంఘించింది కుందేలు పిల్ల. అంతలో నక్క తేరుకొని దాన్ని పట్టు కోవడానికి పరుగెత్తడం ప్రారంబించింది. ఇలా పరుగెత్తి పోయే మార్గమధ్యలో వేటగాడు వేసిన వలలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ "నన్ను రక్షించండి... నన్ను రక్షించండి" అంటూ అరుస్తుంది నక్క.
దానిని గమనించిన కుందేలు పిల్లకు జాలి కలిగి దాని మిత్రుడు ఐన చిట్టెలుక వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి దానిని ఎలాగైనా రక్షించమని కోరింది. మొదట ఒప్పుకోక పోయిన తన స్నేహం మీద గౌరవంతో వలను కొరికి వలలో చిక్కుకొన్న నక్కను కాపాడింది. తాను చేసిన పనికి సిగ్గు పడి నక్క కుందేలు పిల్లకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా తన తల్లికి ఒప్ప చెప్పి చేసిన తప్పుకు చింతిస్తూ అక్కడి నుండి వెళ్లి పోయింది.
నీతి: శత్రువైన కాపాడమని కోరినప్పుడు కాపాడడం మన ధర్మం