ప్రపంచ పటంలో మన దేశం రెండో స్థానం
అభివృద్ధి పరుగు పందెంలో అయితే బాగుండు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అయితే బహు బాగుండు
కానీ... మనదేశం జనాభా భారాల్లో చైనాకు తమ్ముడైన ద్వితీయుడు!
అతి జనాభా సంక్షోభాల పద్మ వ్యూహంలో
వనరులు సంపదలు అంకమధ్యమంలో పెరుగుతూ వుంటే
జనాభా ప్రవాహం గుణమధ్యమంలో పోటీ పడి పెరుగుతూ
పుట్టే ప్రతి బిడ్డ సంక్షోభ కారకుడవుతున్నాడు !
పెరుగుతున్న జనాభా మానవ వనరులకు ఊతమైన
ఆకలి బాధలకు చెప్పలేని ఎతల జీవనంలో
నిరుద్యోగం కుంపటి లో నివురు గప్పిన నిప్పులా
ఆకలి మరణాలు చితిమంటల్లో ఘోషిస్తున్నాయి !
నివాస వసతి లేక ఇరుకైన ఇళ్ళల్లో ఇక్కట్లు పడుతూ
ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలకు కన్నీళ్లు పెడుతూ
పరిశ్రమలో రేయింబవళ్ళు ఆకలి దప్పులు ఎరుగక
కన్నీటితో దాహం తీర్చుకుంటూ
కాలుష్య కోరల్లో అనారోగ్య భూతానికి బలై పోతున్నారు!
తలసరి ఆదాయం నేల చూపులు చూస్తుంటే
వృధ్ధి రేటు క్షయ వ్యాధిలా క్షీణిస్తుంటే
సామాజిక అంతరాలు సమాంతరంగా పరుగెడుతుంటే
వలస జీవుల బ్రతుకులు చెట్టుకు పుట్టకు దగ్గరై వలవల ఏడుస్తుంటే
పచ్చని అడవులు స్వార్థ పరుల కు బలై
మోడువారి చేతులు చాచి రక్షించమని వేడుకుంటుంటే
భూమాత కన్నీరేడుతుంది ఈ భారం మోయలేక...!
--- కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.