"తొలి ఏకాదశి"
ఆషాడ శుక్ల ఏకాదశి
(శయన ఏకాదశి )
ఆషాడమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు.
శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో సయనిస్తాడు కనుక శయన ఏకాదశి అని పేరు.
చతుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక తొలి ఏకాదశి అని పేరు ..
హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.
తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి..
తొలి ఏకాదశి విశిష్టత
ఆషాడ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి
దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు.
సంవత్సరం మొత్తం మీద వచ్చే 24ఏకాదశిలు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. (ప్రతి నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశిలు వస్తాయి.)
ఏకాదశి అంటే పదకొండు అని అర్ధం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు,5కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనసును కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకాన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి...
ఈ రోజు నుంచి శ్రీ మహా విష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పుపై శయనిస్తాడు. కనుక దీనిని 'శయన ఏకాదశి 'అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతి లో జరిగే మార్పులకు (పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ) సంకేతంగా చెప్పవచ్చు.
ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. (సూర్యుడు దక్షిణ వైపుకు మరలినట్లు, ఈ రోజు నుండి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది.) అంతేకాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకుని, కార్తీక మాసం శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.
ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తల మునకలౌతున్న మానవజాతిని ఉద్దరించడానికి సాక్షాత్తు శ్రీ హరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుండి విముక్తి పొందగలరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొన్నారని చూప్తుంటారు.
తొలి ఏకాదశి రోజున శేషసయిని పూజిస్తే
ప్రతినెల వచ్చే ఏకాదశి రోజున శ్రీ హరిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.
ప్రాశస్త్యం
ముఖ్యంగా ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి, శేష సాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం వస్తుందని విశ్వాసం.
ఆషాడమాసం శుక్ల పక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని "శయన ఏకాదశి "అనికూడా అంటారు. సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.
తొలి ఏకాదశినాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని "ఉత్దాన ఏకాదశి" అంటారు.ఆ తరువాత రోజు వచ్చే ద్వాదశి నే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నే పవిత్రంగా పరిగనించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు.
........జై శ్రీ మన్నారాయణ..
వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా.
ప్రక్రియ: వ్యాసం